నగరంలో మరో అపెండెక్స్ ఆపరేషన్ ఫెయిల్యూర్.
హనుమకొండలోని “శ్రీ ఉదయ్ హాస్పిటల్” లో జరిగిన ఘోరం
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన…
బయటకు రాకుండా మేనేజ్ చేసిన హాస్పిటల్ యాజమాన్యం?
జరిగిన సంఘటనపై డిఎంహెచ్ఓ కి, పోలీస్ కమిషనర్ కీ ఫిర్యాదు చేసిన పేరెంట్స్.
బాలసముద్రంలోని శ్రీ ఉదయ్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోండి.., బాలుడి తల్లిదండ్రుల వేడుకోలు
నగరంలో ఇటీవల అపెండిక్స్ ఆపరేషన్లు ఫెయిల్యూర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి..
నిద్రపోతున్న వైద్యాధికారులు, సపోర్ట్ చేస్తున్న ఐఎంఏ..?
సగం సగం వైద్యం.., అనుభవం లేని వైద్యులు, ఇష్టారాజ్యంగా ఆపరేషన్లు..?
నేటిధాత్రి, వరంగల్
నగరంలో మరో అపెండెక్స్ ఆపరేషన్ ఫెయిల్యూర్ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా గురిజాల గ్రామానికి చెందిన బాధిత బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం…, తమ 13యేండ్ల బాబుకి తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతుండగా ఒక మధ్యవర్తి చెప్పిన మాటలు నమ్మి హనుమకొండ బాలసముద్రంలో గల “శ్రీ ఉదయ్ హాస్పిటల్” లో చికిత్స నిమిత్తం చేరామని, అపెండెక్స్ గా గుర్తించిన హాస్పిటల్ వైద్యులు, ఆపరేషన్ కోసం 40 వేల రూపాయలు అవుతుంది అని, ముందుగానే ఫిక్స్ ప్యాకేజ్ మాట్లాడుకుని, ఎలాంటి ముందస్తు పరీక్షలు చేయకుండానే శస్త్ర చికిత్స చేశారు అని తెలిపారు. ఆపరేషన్ చేసిన రోజు నుండే ఇంకా నొప్పి ఎక్కువ అవుతుండగా హాస్పిటల్ వారికీ తెలియచేయగా, వారు పట్టించుకోలేదని, అట్టి శస్త్ర చికిత్స వికటించి బాలుని ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారింది, బాలుని తల్లిదండ్రులు వైద్యులను ప్రశ్నించడంతో మేము ఎలాంటి తప్పు చేయలేదంటూ ముఖం చాటేసే ప్రయత్నం చేశారు. వెంటనే బాలుడిని హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కీ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించామని తెలిపారు. ప్రాణాలను కాపాడవలసిన వైద్యులే కాలయములుగా మారుతున్నారు. ఇలాంటి బాధ్యత రహిత వైద్యులను, ఉన్నతాధికారులు వెంటనే చట్టపరంగా శిక్షించవలసింది పోయి, వారికి వత్తాసు పలుకుతున్నారు అని బాలుడి తల్లిదండ్రుల ఆవేదన.. ఈ సంఘటనపై బాలుడి తల్లిదండ్రులు వైద్యశాఖ అధికారులకు, అటు పోలీసు కమిషనర్ కు రాతపూర్వకంగా పిర్యాదు చేశారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..