రాజన్న ఆలయంలో అవినీతి ఆరోపణలు

ఆలయంలోని 13 మంది సిబ్బందిపై చర్యలు

వేములవాడ నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఏ చిన్న ఇష్యూ జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అది పెను సంచలనమే. అలాంటిది గురువారం ఆలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మొత్తం 13మందిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు ఏ.ఈ.వోలు, నలుగురు పర్యవేక్షకులు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, మరో ఇద్దరు పొరుగు సేవల సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. మొత్తం 14 మందిపై చర్యలు తీసుకున్నారంటూ వినబడిన మరొకరి ప్రస్తావన రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా ప్రసాదాల తయారీ పర్యవేక్షకుడికి దేవాలయ ఖాతాలో డబ్బులు జమ చెయ్యాలని ఆదేశించడంతో అవినీతి అధికారుల సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజన్న ఆలయ అధికారులు, సిబ్బందిపై చర్యలు ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి.

ఆందోళనలో మరికొందరు

గుడిని మింగే వాళ్ళు ఉంటే, గుడితో పాటు లింగాన్ని మింగే మహానుభావులు ఆలయ ఉద్యోగులుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో 13మంది ఆలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం పట్ల మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఎంతోమందిపై నిఘా కొనసాగడం, చాలా మంది ఉద్యోగులు, సిబ్బందిపై నిత్యం అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతుండటంతో ఇందులో తమ పేర్లు ఉంటాయేమోనని, ఎప్పుడూ ఏమి జరుగుతుందోనని కొంతమంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకునే పరిస్తితి ఇప్పుడు ఆలయ అధికారులు, సిబ్బందిలో నెలకొంది.

ప్రభుత్వం మారడమే ప్రధాన కారణమా….?

వాస్తవానికి ఈ 13మంది ఉద్యోగులకు సంబంధించి 2021లోనే విజిలెన్స్ విచారణ పూర్తయింది. కానీ నివేదిక ఫైల్ అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ వద్ద పెండింగ్ లో ఉండటం, సదరు ఉద్యోగులకు అప్పటి బి.ఆర్.ఎస్ ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉండటంతో ఫైల్ ముందుకు కదలలేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే వీరిపై చర్యలు తీసుకోవడం వీలు పడలేదనే వాదనలు లేకపోలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిందో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో సీఎం రేవంత్ రాజన్న దేవాలయ అభివృద్ధిపై దృష్టి సారించారో ఇక అప్పటి నుండి ఆలయానికి మంచి రోజులు వచ్చాయనే అందరూ భావించారు.

అదే సమయంలో గత ప్రభుత్వంలో ఏళ్ల తరబడి కమిషనర్ గా ఉన్న అనిల్ కుమార్ ను ఇతర శాఖకు బదిలీ చేసి హనుమంతరావును నూతన కమిషనర్ గా నియమించారు. దీంతో ఆప్పటి పెండింగ్ ఫైల్ లు అన్ని ఇప్పుడు ముందుకు వస్తున్నాయని ఈ క్రమంలోనే రాజన్న ఆలయ ఫైల్ ముందుకు రాగా దీనిపై చర్చించి, ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీనికి తోడు కమిషనర్ హనుమంతరావు వేములవాడ పర్యటనకు వచ్చిన రెండు రోజుల్లోనే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం పై వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

14వ వ్యక్తి ఎవరూ…?

మరోవైపు 13మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్న మరుక్షణమే ఇక్కడ మరో కొత్త చర్చ మొదలైంది. ఆనాడు విజిలెన్స్ అధికారులు సమర్పించిన నివేదికలో మొత్తం 14మంది పేర్లు ఉండగా, ఇప్పుడు చర్యలు తీసుకున్న వారిలో 13మంది పేర్లు మాత్రమే ఉన్నాయని, చర్యలు తీసుకోని మిగతా ఆ ఒక్కరు ఎవరు అంటూ చర్చ మొదలైంది. అయితే మిగిలిన ఆ ఒక్క వ్యక్తి ఆలయ ఈ.ఓ కృష్ణ ప్రసాద్ అంటూ ఆలయ ఉద్యోగుల్లో బహిరంగంగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

స్పందించని ఈవో

అయితే ఇదే విషయంపై ఆలయ ఈ.వో కృష్ణ ప్రసాద్ ను వివరణ కోరేందుకు ప్రయత్నం చేయగా ఆయన ససేమిరా స్పందించేందుకు సుముఖత చూపలేదు. తర్వాత పూర్తి వివరాలు చెపుతాను అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. దాంతో బయట వినిపిస్తున్న ఆ 14వ అధికారి ఈ.వోనే అనే వాదనలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏదిఏమైనాప్పటికీ ఆలయ అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవడం మంచి పరిణామమే అయినప్పటికీ భుజాలు తడుపుకుంటున్న గుమ్మడికాయ దొంగలపై కూడా చర్యలు తీసుకోవాలని రాజన్న భక్తులు, జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version