మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో పర్యటించనున్న రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కోల్ బెల్ట్ ప్రాంత వాసులు ఘనస్వాగతం పలకాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని టిబిజికెఎస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాలలో ఆదివారం రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పట్టణంలో నిర్వహిస్తున్న రోడ్ షోను, అదేవిధంగా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు కార్మిక వర్గం, తెలంగాణ వాదులు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టిందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా కార్మికులకు లాభాల వాటా 32శాతం ప్రకటించి, దసరా పండుగ లోపు కార్మికులకు లాభాల వాటా సుమారు 711 కోట్లు చెల్లించడం జరుగుతుందని, ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ తగినదని తెలిపారు. సమైక్య ప్రభుత్వాలు సింగరేణి కార్మికులకు అరాకొర లాభాల వాటా చెల్లించడం జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ మొత్తంగా 32 శాతం లాభాల వాటా చెల్లించడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా ఇటీవలే సింగరేణి కార్మికులకు 11వ వేతనానికి సంబంధించిన 23 నెలల ఏరియార్స్ బకాయిలను ఒకే దఫా చెల్లించి, కార్మికుల్లో సంతోషాన్ని కలిగించింది తెలిపారు. సింగరేణి కార్మికులకు అనేక ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతోపాటు అనేక హక్కులు కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. బిజెపి ప్రభుత్వం నిర్వహిస్తున్న బొగ్గు క్షేత్రాల వేలంపాటకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిలో మూడు రోజులు సమ్మె చేసి, వేలంపాటను అడ్డుకున్నారని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమను ప్రైవేట్ పరం చేయకపోవడానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడమే కారణమని, బిఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కార్మిక వర్గం రుణపడి ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞంలా కొనసాగుతుందని, మారుమూల ప్రాంతాల్లో సైతం నేడు గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని, 50 ఏళ్లులో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతుందన్నారు. ఆదివారం కేటీఆర్ రోడ్ షోకు, బహిరంగ సభకు కార్మిక వర్గం, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే రవీందర్, నాయకులు బడికెల సంపత్ కుమార్, ఓ రాజశేఖర్, ఏరియా నాయకులు, అన్ని గనుల ఫిట్ కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.