సుఖేష్ ఎవరో నాకు తెలియదు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలపై వివరణ

కొన్ని మీడియా సంస్థలది అత్యుత్సాహం..

దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్నట్లుంది వారి పరిస్థితి

బురదజల్లడం మానుకోవాలి..

నేటిధాత్రి హైదరాబాద్: కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వంపై, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నాపై ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత గురువారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణ, కేసీఆర్ జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని క‌విత తెలిపారు. ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామక లేఖను విడుదల చేయడం, దాని వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్‌లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని క‌విత పేర్కొన్నారు.

త‌ప్పుడు వార్తలు..

సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో నాకు పరిచయం కూడా లేదు. అతనెవరో నాకు తెలియదు. కానీ వాస్తవాలను ఏవి పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయి. గతంలో మొబైల్ ఫోన్ల విషయంలోనూ ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్‌ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నార‌ంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్న చందంగా, అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థల తీరు ఉంది. ఇది అత్యంత దురదృష్టకరం. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం, బీఆర్ఎస్ పార్టీపై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరింత దిగజారి వార్తలు ప్రసారం చేస్తారని తెలంగాణ సమాజం గ్రహించాలని, జాగ్రత్త పడాలంటూ క‌విత సూచించారు.

త‌ల‌వంచం.. తెగించి కొట్లాడుతాం..

తెలంగాణ ప్రజలు విజ్ఞులు.. పాలు ఏంటో, నీళ్లేంటో తెలిసిన చైతన్య జీవులు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. కేసీఆర్ మీద క‌క్షతో, అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో ముందు వరుసలో నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈర్శ్యతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తెలంగాణ సమాజం తప్పకుండా తరిమి కొడుతుంది. నా మీద బురదజల్లే వార్తలకు కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన అగ్ర ప్రాధాన్యత, దమ్ముంటే, నిజాయితీ ఉంటే నా వివరణకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం.. అంటూ ఎమ్మెల్సీ క‌విత ప్రక‌ట‌న విడుద‌ల చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version