ఎనమిది వసంతాలు నిండిన ఈ నేల` ఈ వేళ!

తెలంగాణ ప్రజలందరికీ నేటిధాత్రి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు…

పల్లె మరుస్తోంది..

పచ్చదనం పరవశిస్తోంది…

పట్నం పరుగులు పెడుతోంది…

కాలువల్లో నీళ్లు`రైతు ఇంట ధాన్యసిరులు…

పాడి`పంటలు…చిగురించిన చేతి వృత్తులు…

ఇరవై నాలుగు గంటల కరంటు వెలుగులు….

ప్రభుత్వమే అండగా, కుటుంబాలకు పండగ ఆసరా ఫించన్లు…

నిండిన చెరువులు` కాళేశ్వరం పరవళ్లు…

 

ఇంటింటికీ మిషన్‌ భగీరధ మంచినీళ్లు…

తెలంగాణ అంతటా సంబూరాలు…

దార్శనికుడు కేసిఆర్‌ పాలనకు ప్రజల జేజేలు…

నీటి జాడల తెలంగాణ. సాగు నీటి పరవళ్ల తెలంగాణ. కరువు పారిపోయిన తెలంగాణ. బీడుకానరాని తెలంగాణ. చెరువులు బాగు పడ్డ తెలంగాణ. చెరువులు గంగాళాలైన తెలంగాణ. కాళేశ్వరం నీరు కాలువల్లో పరుగులు పెడుతున్న తెలంగాణ. సాగు సస్యశ్యామల తెలంగాణ. పడావు బడ్డ భూముల్లో పంటలు పుష్కలమైన తెలంగాణ. పల్లె మురుస్తున్న తెలంగాణ. పచ్చదనం వెల్లివిరిసిన తెలంగాణ. అరవైఏళ్ల గోసను ఆరేళ్లతో తెలంగాణ పొలిమేరలకు తరిమిన తెలంగాణ. సంక్షేమ తెలంగాణ. సాధికారిత సాధించిన తెలంగాణ. చేతి వృత్తులకు మళ్లీ జీవమైన తెలంగాణ. పల్లెబతుకుల్లో వెలుగులు నిండిన తెలంగాణ. పట్నం పరుగులు పెడుతున్న తెలంగాణ. పల్లెల్లో వెలుగుల తెలంగాణ. వేకువలో వెండి వెన్నెల తెలంగాణ. ప్రగతి తెలంగాణ. బంగారు తెలంగాణ. ఇదంతా ఎనమిదేళ్ల కాలంలో తెలంగాణ దార్శనికుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆవిష్కరణ.   

ఒకనాడు ఎటు చూసినా ఏమున్నది నా తెలంగాణ. ఊర్లన్నీ వలసపోయి, ఇళ్లన్నీ కూలిపోయి, చేతివృత్తులు మాయమైపోయి, దిక్కులేని బతుకుల కాలమది. ఎటు చూసినా బీడువారి నోర్లు తెరిచిన పొలాలే….ఏ చెలక చూసినా ఎడారే…చెరువుల ఆనవాలు పోయి, తుమ్మలు మొలిచి నీటి కటకటలే…సమైక్య పాలకుల దాష్టికానికి తెలంగాణ కకావికలమైంది. చెరువులు ఆగమైనవి. ఆనవాలు లేకుండాపోయాయి. పల్లెలు రూపు చెదిరిపోయాయి. సొంత రాష్ట్రంలో తెలంగాణ వాసుల జీవితాలు పరాయి బతుకులయ్యాయి. ద్వితీయ శ్రేణి పౌరుల కింద లెక్కలయ్యాయి. విద్య లేదు. ఉపాధి లేదు. కొలువులు రావు. పంటలకు దిక్కులేదు. ఆకలి తీరింది లేదు. కరువు కాటును తప్పించింది లేదు. కొట్లాడినా లాభం లేదు. పల్లెల్లో ఎండుటాకుల అలజడి…పట్టణాల్లో కానరాని ప్రగతి. ఇదీ ఒకనాడు తెలంగాణ దుస్దితి. సమైక్య పాలనలో తెలంగాణ పల్లెల్లో కరంటు లేక, రాక, సాగు సక్కగ సాగక, ఎండుతున్న పంటలతో విలవిలలాడిన తెలంగాణ. కాని అదే సీమాంద్రలో నీటి సవ్వడి…ప్రాజెక్టులు వడివడి. రోడ్లు రువ్వడి. సీమాంధ్ర నాయకుల దోపిడీ…తెలంగాణ నిధులతో సీమాంధ్రలో అభివృద్ధి…

సగటు తెలంగాణ వాది కడుపు రగిలినా, ఆకలి ముందు కోపం దిగమింగుకొని బతికిన రోజులవి. ఆ రోజులనుంచి తెలంగాణ విముక్తి చెందింది. ఒక్కడు ప్రశ్నించడం మొదలు పెట్టాడు…సీమాంధ్ర పాలకులపై కన్నెర్ర చేశాడు..తెలంగాణకు జరుగుతున్న అన్యాయం

నిలదీశాడు..ప్రశ్నించాడు..ఎదిరించాడు…తెలంగాణ జెండా ఎత్తుకున్నాడు…జై తెలంగాణ అంటూ నినదించాడు… పారే ఏరు ఎండిపోయి, వాగు ఒట్టిపోయి చుక్క నీరు కంట పడని కాలంలో ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంట నుంచి జాలువారిని కన్నీటి చుక్క పోరాటానికి శ్రీకారం చుట్టింది. అదే కేసిఆర్‌ కంట నుంచి రాలిన నీటి చుక్క తెలంగాణ భూమిని తడిపేందుకు మొదటి చినుకైంది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టైంది…తెలంగాణ సస్యశ్యామలమౌతోంది. అందుకే ఎత్తిన జెండాను కేసిఆర్‌ దించలేదు. బిగిసిన పిడికిలి విప్పలేదు. జై తెలంగాణ నినాదం ఆపలేదు. పుబ్బలో పుట్టి, మగలో మాయమౌతుందన్న వారి ఎగతాళినుంచి కసిని పెంచుకొని పోరాటం చేశాడు. పట్టిన పట్టు విడవకుండా, ఒక్కడుగా మొదలై, ఒక్కటే అడుగై, ఒకరినొకరు ఆయనలో అడుగులో అడుగై, లక్షల మంది కేసిఆర్‌లను తయారు చేసిండు. పద్నాలుగేళ్ల నిరంతర పోటారం చేశాడు. రక్తపు చుక్క చిందించకుండా తెలంగాణ సాధించాడు. అరవై ఏళ్ల తెలంగాణ కల నెరవేర్చాడు. తెలంగాణ ఏర్పడిరది. సాగుకు ఇరవైనాలుగు గంటల కరంటు. మిషన్‌ కాకతీయతో 46వేల చెరువుల పునరుద్దరణ. మళ్లీ కాకతీయుల కాలం కళ్ల ముందు ఆవిష్కరణ. చెరువులన్నీ నిండగ, ఎండాకాలంలో మత్తళ్లు దుంకంగ, వాగులు ఒర్రెలు గోదారి జలాలు పారంగ, జలజలగలగలలు కళ్ల ముందు కదలాడంగా తెలంగాణ కలల ప్రపంచం, మన కళ్ల ముందు నిజప్రపంచమైంది. సంక్షేమంలో మేటిగా అడుగులేస్తోంది. ప్రగతిలో పరుగులు పెడుతోంది. 

ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కారమైంది. మిషన్‌ భగీరధతో తెలంగాణ పల్లెల్లోకి గోదారి పరవళ్లు పరుగులు తీసి, ఆడ పడుచుల కాళ్లు కడుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ చరిత్రను పదిలం చేసింది. పది కాలాలపాటు తెలంగాణకు నీటి గోస తీరింది. సస్యశ్యామల తెలంగాణలో బంగారు సిరులు పండుతున్నాయి. స్వపరిపాలనతో ఆత్మ గౌరవం వెల్లివిరిస్తోంది. నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించిన వారు కూడా అబ్బుర పడేలా తెలంగాణ తలెత్తుకొని నిలబడిరది. పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు. పల్లె వికాసమే దేశ వికామని నాయకులు నమ్మితే చాలు…పల్లె సింగారించుకుంటుంది. పచ్చదనంతో సిరులారబోసుకుంటుంది. పసిడి పంటలకు నెలవౌతుంది. పాడి పంటలకు కొదువ లేకుండాపోతుంది. దేశానికి అన్నం పెట్టే ధైర్యం రైతన్నలో కనిపిస్తుంది. వారి మోములో ఎప్పుడూ చిరునవ్వు తొనికిసలాడుతుంది. సాగు అనగానే పులకించేంది…తరించేది రైతే…ఆ రైతు మేలు కోరిన రాజ్యాలు కళకళలాడాయి.

 రైతే పాలకుడైతే ఎలా వుంటుంది? కేసిఆర్‌ పాలనలా వుంటుంది. అది తెలంగాణలా వుంటుంది. పల్లె శోభితమై పరవశిస్తుంది. పంటల రాశులు, పారుతున్న నీళ్లు, పచ్చని చేలు, కొట్టం నిండిన పాడితో సంబురం నిండుతుంది. అది ఇప్పుడు తెలంగాణలో కనబడుతోంది. తన కన్నీటి పొరల్లో నాలుగు దశాబ్దాల పాటు దాచుకున్న తెలంగాణ స్వప్నం నిజంచేసిన దార్శనికుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. బీడు వారిన భూములను సస్యశ్యామం చేశాడు. తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన భూములకు కోట్ల ధరలు పలికేలా చేశాడు. అటు సాగు, ఇటు నీరు, మరో వైపు పరిశ్రమలు, సంక్షేమ, ప్రగతి రంగాలన్నీ ఏకకాలంలోనే సాక్ష్యాత్కారాలు ఒక్క తెలంగాణలోనే…పచ్చని ప్రకృతిలో పుడమి పులకించుతోందంటే జాతి సగర్వంగా బతుకుతన్నదని అర్ధం. అది ఇప్పుడు మన తెలంగాణ ముఖ చిత్రం. దేశ సౌభాగ్యంలో కూడా తెలంగాణ ఆవిష్కరణలు రావాలి. కేసిఆర్‌ దేశాన్నే ఏలే నాయకుడు కావాలి. తెలంగాణ ప్రగతి దేశ పరివ్యాప్తమై సర్వతోముఖాభివృద్ధి జరగాలి. దేశం సుభిక్షం కావాలి. కేసిఆర్‌ నాయకత్వంలో దేశం కళకళలాడాలి….

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version