అప్పుడు వలసల జిల్లా… ఇప్పుడు ఉపాధికి ఖిల్లా.

సెప్టెంబర్ 2న, 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే మెగా జాబ్ మేళా.

ప్రస్తుతం 650 మందికి ఐటీ టవర్ లోనే ఉద్యోగావకాశాలు

దేశంలోనే అతి పెద్ద ఎనర్జీ పార్క్ తో మరో 10వేల ఉద్యోగాలు

స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ

ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారికి ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ లక్ష్యం

నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

పాలమూరు అనగానే వలసలకు, నిరక్షరాస్యతకు, పేదరికానికి కేరాఫ్ అడ్రస్ అనేలా ఉండేదని అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితిని పూర్తిగా మార్చివేసి ఉపాధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్థానిక యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని… ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి లేకుండా చూస్తామని అందులో భాగంగా తీసుకువచ్చిన ఐటీ టవర్ లో ఐటీ కొలువులను స్థానిక యువతకు దక్కేలా ఈ జాబ్ మేళాను నిర్వహించామని తెలిపారు. మహబూబ్ నగర్, శిల్పారామంలో బుధవారం నాడు టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 650 మంది స్థానిక నిరుద్యోగ యువతకు ఈ మేళా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 2న నిర్వహించే మెగా జాబ్ మేళాలో జిల్లాలోని 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు.

పాలమూరు అంటేనే లేబర్ అనేలా ప్రపంచమంతా పేరు వచ్చిందని… ఎక్కడ నిర్మాణ పనులు జరిగినా పాలమూరు లేబరే కనిపించేవారని మంత్రి అన్నారు. ఆకలి చావులు వుండేవని, అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. ఇప్పుడు ఇంత సర్వాంగ సుందరంగా ముస్తాబైన శిల్పారామం చెత్తాచెదారంతో, పెద్ద చెరువు కట్టపై కాలు మోపడానికి కూడా సందులేని విధంగా ఉండేదని, పట్టణంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని, ఇలాంటి ఇబ్బందులు అన్నిటిని అధిగమించి జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో దివిటి పల్లి వద్ద ఐటీ కారిడార్ ను ఏర్పాటు చేశామన్నారు. మొదటి విడత మహబూబ్ నగర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సెప్టెంబర్ 2న 100 కంపెనీలతో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా మరో మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నామన్నారు. ఇవాళ జరిగిన జాబ్ మేళాలో అవకాశం రాని వారికి కూడా మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. బుధవారం నాటి జాబ్ మేళాకు హాజరై ఉద్యోగం రానివారు తిరిగి సెప్టెంబర్ 2న నిర్వహించే జాబ్ మేళాకు హాజరు కావాలని ఆయన కోరారు. జాబ్ మేళాకు హాజరైన వారందరి వివరాలను సేకరించి సిద్ధంగా ఉంచాలని నిర్వాహకులను ఆయన ఆదేశించారు.

మహబూబ్ నగర్ ఐటి టవర్ లో దేశంలోనే అతి పెద్దదైన ఎనర్జీ పార్కును ఏర్పాటు చేస్తున్నామని, అమరరాజా లీథియం గిగా సెల్ పరిశ్రమ ద్వారా 10వేల మందికి స్థానికంగానే యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగం కోసం పాకులాడకుండా ప్రైవేటు ఉద్యోగాలలో సైతం చేరాలని సూచించారు. మొత్తం జనాభాలో రెండు శాతం జనాభాకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రైవేట్ కంపెనీలలో సైతం కష్టపడి రాణించి ఉన్నత స్థాయికి చేరుకునాలని అన్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ పారిశ్రామికంగా, పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. దేశంలోనే అతి పెద్దదైన 2097 ఎకరాలలో అర్బన్ ఎకో పార్కును ఏర్పాటు చేశామని… త్వరలోనే 26వేల ఎకరాల్లో జంగిల్ సఫారీ ప్రారంభించనున్నామని తెలిపారు. హన్వాడలో ఫుడ్ పార్క్ రానుందని, మినీ ట్యాంక్ బండ్, సస్పెన్షన్ బ్రిడ్జి, ఐలాండ్, ఏసీ బోట్ ఏర్పాటు చేస్తున్నామని, శిల్పారామం ఆవరణలో అతి పెద్ద వండర్ అమ్యూజ్ మెంట్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

> 13న డ్రోన్ షో కోసం యువత పెద్ద ఎత్తున తరలిరావాలి..

 

ఇప్పటికే వర్షం కారణంగా మినీ ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించతలపెట్టిన డ్రోన్ షో ను ఈ నెల 13న ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 650 డ్రోన్లతో సాయంత్రం 7 గంటలకు ఎంతో అత్భుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. విదేశాల్లో మాత్రమే ఇలాంటి ప్రదర్శన తిలకించేందుకు అవకాశం ఉంటుందని , ఈ ప్రదర్శనను అందరూ తిలకించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

> జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకునాలి.

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా సీఎం కేసీఆర్ అనేక కంపెనీల సహకారంతో జాబ్ మేళాలు నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చారని రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక జాబ్ మేళాలు నిర్వహించామన్నారు. యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నిరుద్యోగ యువత ముందు అవకాశాలను అందిపుచ్చుకునాలని ఆ తర్వాత మరింత ఉన్నత స్థానానికి ఎదిగేందుకు ప్రయత్నించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్ యువతకు సూచించారు. బుధవారం నిర్వహిస్తున్న జాబ్ మేళాలో విద్యార్థులకు తగ్గట్టుగా ఉద్యోగం దొరుకుతుందని, ఎవరికైనా నైపుణ్యం లేనట్లయితే అలాంటి వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

జిల్లా ఎస్పీ కే .నరసింహ, టాస్క్ డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రైతుబంధు డైరెక్టర్ మల్లు నరసింహారెడ్డి, సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్, అడిషనల్ ఎస్పీ రాములు, ఆర్డీవో అనిల్ కుమార్, స్థానిక సంస్థల ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ యాదయ్య, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version