వాళ్ల నోటికి, మాటకు నిజం రాదా!?

ఇంత అన్యాయమా!?

`తెలంగాణకు వచ్చిన వాటిని ఊడ్చుకెళ్లిన వాళ్లు అభివృద్ధి చేస్తారా?

`తరలించుడు తప్ప, ఇచ్చింది లేదు, తెచ్చింది లేదు?

`తెలంగాణకు కేటాయించిన ఐటిఐఆర్‌ ను గుజరాత్‌ తరలించారు…?

`కాజీపేట రైల్వే కోచ్‌ గుజరాత్‌ కు మళ్లించారు….

`బిబినగర్‌ ఎయిమ్స్‌ కు రూపాయిచ్చింది లేదు?

`ఆదిలాబాదుకు గిరిజన యూనివర్సిటీ రాలేదు?

`నిజామాబాదులో పసుబు బోర్డు జాడే లేదు?

`ఒక్క మెడికల్‌ కాలేజీ మంజూరు చేయలేదు?

`కరీంనగర్‌ కు ఐఐటి రాలేదు?

`హైదరాబాద్‌ లో పెట్టాల్సిన ఆయుష్‌ గుజరాత్‌ కు ఎందుకు పోయింది?

`హైదరాబాద్‌ కు పోటీగా గుజరాత్‌ లో ఇంటర్నేషనల్‌ ఆర్భిటేషన్‌ ట్రిబ్యునల్‌ ఎందుకు ఏర్పాటు చేసినట్లు?

`కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఎందుకివ్వలేదు?

`మిషన్‌ కాకతీయ కు ఇస్తామన్న నిధులేవి?

`మిషన్‌ భగీరథ కు సహరిస్తామని సహకారం లేదు?

`కేంద్రంలో అధికారంలో వుండి రాష్ట్రంలో పోరాటమా?

`తెలంగాణ లో అందుతున్న సంక్షేమ ఫథకాలపైన పోరాటమా?

`రైతు బంధు, దళితబంధు, కళ్యాణ లక్ష్మి ఎందుకని కొట్లడతారా?

`చేయాల్సిన అన్యాయాలన్ని చేసి, న్యాయం మాట్లాడే అర్హత వుందా?

`ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కుటుంబ పాలన అనడం అవివేకం?

ప్రతిపక్షం మాట్లాడాల్సిన మాటలు అధికార పక్షం మాట్లాడితే వింతగా వుండడమే కాదు…కాస్త కటువుగా చెప్పాలంటే అసహ్యంగా వుంటుంది. చెండాలమనిపిస్తుంది. కేంద్రంలో ఎనమిదేళ్లుగా అధికారంలో వున్నది బిజేపి పార్టీ. ఎనమిదేళ్లుగా తెలంగాణ ఏనాడు బిజేపి పెద్దలకు కనిపించలేదు. కాని ఇప్పుడు హఠాత్తుగా రాజకీయం కోసం మాత్రమే తెలంగాణ వారి కళ్లకు కనిపిస్తోంది. తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఏం చేస్తోంది…బిజేపి ఏం అన్యాయం చేసిందో ప్రతి తెలంగాణ వాదికి తెలియాల్సిన అవసరం వుంది. ఈ ఎనమిదేళ్లకాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు. అది చెప్పుకోవడానికి ఎలా ప్రజల్లో వెళ్లాలన్న సంశయం అసలే లేదు. కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా చేసిన పని ఒక్కటీ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగినవి ఇవ్వలేదు. పైగా అనేక రకాల పధకాల మీద ఇవ్వాల్సిన నిధుల విడుదల లేదు. విభజన హామీలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వున్నాయి. అలాంటి బిజేపి నాయకులు తెలంగాణ ప్రజల కోసం మేమున్నామనే అర్హత వారికి లేదు. పెట్టే స్ధానంలో కూర్చొని, కొట్లాడతామని చిల్లర ముచ్చట్లు చెప్పడం మరీ విచిత్రం..దుర్మార్గం. గతంలో ప్రధానులు రాష్ట్రాలకు వస్తున్నారంటే ఏ వరాలు కురిపించి పోతారో అని ఆశగా ఎదురుచూసేవారు. కాని కేంద్రంలో బిజేపి వచ్చాక తెలంగాణకు ఒక్క వరం ఇచ్చింది లేదు. వాటి అభివృద్ధి పనులు మీద ప్రధాని నాలుగు సార్లు వచ్చింది లేదు. కనీసం రాజకీయాల కోసమైనా వచ్చి ఇచ్చిన హామీ ఒక్కటీ లేదు. కాకపోతే మనమే వస్తాం…మనమే పాలిస్తాం…అని నాలుగు మాటలు చెప్పడం బాగా అలావాటు చేసుకున్నారు. పైగా తెలంగాణ రాష్ట్ర సమితిమీద యుద్దం చేస్తాం…తెలంగాణలో జెండా పాతేస్తామంటే జనం నవ్వుకుంటున్నారు. 

                     దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పధకాలు తెలంగాణలో అమలౌతున్నందుకు పోరాటం చేస్తారా? ఉద్యమకారుడై, తెలంగాణ సాధకుడై, తెలంగాణ పాలకుడుగా అనేక సంక్షేమ పథకాల రూపశిల్పిగా కేసిఆర్‌ ప్రజల మన్ననలతో రెండుసార్లు గెలిచారు. అలాంటి పధకాలు బిజేపి పాలిత రాష్ట్రాలలో అమలు చేయలేక, ఇక్కడేం పోరాటం చేస్తారు. రైతు బంధు ఎందుకిస్తున్నారంటారా? లేక దళితబంధు ఎందుకు అని ప్రశ్నిస్తారా? ఎక్కడైనా పధకాలు లేకుంటే ప్రశ్నిస్తారు? కళ్యాణ లక్ష్మి కనిపించడం లేదా? తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని అనేక రకాలపై పథకాలు అమలౌతున్నాయి. బిజేపి పాలిత రాష్ట్రాలలో పించన్లు ఎక్కడా కనీసం వెయ్యి రూపాయలు కూడా ఇవ్వడం లేదు. కాని తెలంగాణలో ఎంత ఇస్తున్నారో చూస్తూనే పోరటం చేస్తారా? సహజంగా ఎన్నికల్లో గెలిపిస్తే మేమొస్తే ఏం చేస్తామన్నదానిని చెబుతారు. బిజేపి అది మాత్రం చెప్పదు. ఆఖరుకు వరంగల్‌ డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ కనీసం తోచిందైనా చెప్పింది. ఇన్ని సార్లు బిజేపి డిల్లీ పెద్దలు వచ్చి, తెలంగాణ చూసింది లేదు. చుట్టి వచ్చింది లేదు. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నది లేదు. తెలంగాణకు ఏం కావలో ఆ పార్టీ ఎంపిలు అడిగింది లేదు. వాళ్లు ఇచ్చింది లేదు. 

                        పెరుగుతున్న ధరలు అదుపు చేసేది లేదు. రైతులకు గిట్టుబాటు ధరలేదు. ఏముందుని చెప్పుకోవడానికి తెలంగాణలో జెండా పాతడానికి అని ఒక్కసారైనా ఆలోచించారా? కేంద్రంలో అధికారంలో అధికారంలోకి రాగానే ఏడు మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపారు. అప్పుడే తెలంగాణ ప్రజలు మర్చిపోయానుకుంటున్నారా? తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్లే మేం న్యాయం చేస్తామంటే నమ్ముతారా? ఆదరిస్తారా? రాష్ట్రం విడిపోయినప్పుడు యుపిఏ ప్రభుత్వం ఐటిఐఆర్‌ ( ఐటి ఇన్ఫ్‌ర్మేషన్‌ టెక్నాలజీ ఇన్‌వెస్ట్‌ మెంటు రీజియన్‌) ప్రాజెక్టు తెలంగాణకు ఇచ్చింది. దాన్ని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? లక్షలాది మంది యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు వచ్చే ఈ ప్రాజెక్టును ఎందుకు రద్దు చేశారో ముందు చెప్పండి? లేదా ఇప్పుడే దాన్ని మళ్లీ తెలంగాణకు ఇస్తామని ప్రకటన చేయండి? వెంటనే పనులు ప్రారంభించండి? కాదని ఎవరైనా అన్నారా? ఈ ప్రాజెక్టు మూలంగా కనీసం రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు హైదరాబాద్‌కు వచ్చే అవకాశం వుంది. ఐటి రంగంలో దేశంలోనే హైదరాబాద్‌ నెంబర్‌ వన్‌ అవుతుంది. కాని ఎందుకు ఆపేశారు? ఏ ఉద్ధేశ్యంతో ఆపేశారు? ఎందుకు గుజరాత్‌ తరలించుకుపోయారు? అన్నది తెలియనంత అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు. ఐటిఐఆర్‌ వల్ల దక్షిణాదిలో బెంగుళూరును మించిపోయే నగరంగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలంగాణ మీద నిజంగా ప్రేముంటే, దాన్ని పునరుద్దరించండి? అంతే కాదు కేంద్రం తల్చుకుంటే ఐఐఎం కూడా తెలంగాణకు వస్తుంది. కాని ఎందుకు ఇవ్వడం లేదు. ఎనమిదేళ్లుగా తెలంగాణకు ఏమీ చేయాలనిపించలేదు. కాని కొట్లాడి ఏం ఇస్తారు? తెలంగాణ విషయంలో గతంలో ఎంపిలు కొట్లాడినట్లు, తెలంగాణ అభివృద్ధికోసం బిజేపి ఎంపిలు ఎందుకు ప్రయత్నించడం లేదు? 

తెలంగాణకు రావాల్సిన ఆయుష్‌ సెంటర్‌ను గుజరాత్‌కు ఎందుకు తరలించారు? తెలంగాణకు ఎందుకు అన్యాయం చేశారు? ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు తెలియనివా? అంతే కాదు తెలంగాణకు ఆయుష్‌ సెంటర్‌ వస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా ప్రకటించిన విషయం బిజేపి మర్చిపోయిందా? ఆఖరు నిమిషంలో కిషన్‌రెడ్డికి జెల్ల కొట్టి, గుజరాత్‌కు ఆయుష్‌ ఎందుకు వెళ్లిపోయింది? ఇప్పటికైనా మించి పోలేదు…ఆ ఆయుష్‌ను తెలంగాణకు ఇవ్వండి. కాదంటామా? కరీంనగర్‌ జిల్లా ఎంపిగా వున్న బండి సంజయ్‌ మీద ఇప్పటికే అనేక విమర్శలున్నాయి. తన పార్లమెంటు పరిధిలో కనీసం ఒక్క ఐఐటినైనా తెచ్చావా? అని ప్రజలు ప్రశ్నిస్తూనే వున్నారు. పైగా ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన యూనివర్సిటీపై ఎందుకు నోరు మెదపడడం లేదని ప్రజలు పదే పదే బండి సంజయ్‌ను ప్రశ్నిస్తున్నారు…గిరిజన యూనివర్సిటీ వస్తే సోయం బాబూరావుకైనా పేరొచ్చేది..మరి అవెందుకు ఇవ్వలేదు…ఇంకో ఏడాదిలో ఎన్నికలున్నాయి? ఇంకెప్పుడిస్తారు? ఎందకీ మాటలు అని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. నిజంగా బిజేపికి తెలంగాణ మీద ప్రేమ వుంటే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయొచ్చు. ఎన్నికల ముందు వారం రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, లేకుంటే రాజీనామా చేస్తానని ప్రమాణ పత్రం కూడా రాసిచ్చిన ఎంపి.మాట తప్పేందుకు కారణం ఎవరు? కేంద్ర పెద్దలు కాదా? మూడేళ్లయినా పసుపు బోర్డు జాడ లేదు…కేంద్రం ఇస్తుందన్న ఆశ కూడా తెలంగాణ ప్రజలకు లేదు…బిజేపి ఎంపిలు తెస్తారన్న నమ్మకం అసలే లేదు…బుందేల్‌ ఖండ్‌కు ఇచ్చిన డిఫెన్స్‌ కారిడార్‌ తెలంగాణకు ఇవ్వొచ్చు కదా? ఎందుకివ్వలేదు…తెలంగాణలో ఇంటర్నేషన్‌ ఆర్బిటేషన్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటైంది. కాని దానికి పోటీగా గుజరాత్‌లో మరకొటి ఎందుకు ఏర్పాటు చేశారు? ఇక్కడి ఆర్భిటేషన్‌ ట్రిబ్యునల్‌ అభివృద్ధికి సహకరిస్తే సరిపోయిది కదా! తెలంగాణకు మరింత పెరొచ్చేది కదా!

వరంగల్‌ ఉమ్మడి జిల్లా కాజీపేటలో కోచ్‌ ప్యాక్టరీ తెలంగాణకల. కొన్ని దశాబ్ధాలుగా వరంగల్‌ ప్రజలు ఎప్పుడు బడ్జెట్‌ ప్రవేశపెట్టినా, నేటికీ ఎదురు చూస్తూనే వుంటారు…కాని ఆ మాత్రం ఆశలు కూడా అడియాశసలు చేసిందెవరు? దాన్ని గుజరాత్‌కు తరలించింది ఎవరు? తెలంగాణలో కాజీపేటకు రావాల్సిన కోచ్‌ ప్యాక్టరీని ఎత్తుకుపోయిందెవరు? తెలంగాణకు రావాల్సిన ఇన్ని ప్రాజెక్టులు గద్దలా తన్నుకుపోయిందెవరు? వాళ్లు ఎవరి మీద పోరాటం చేస్తారు? ఎలా న్యాయం చేస్తారో బిజేపి నేతలే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణలో బీబీ నగర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌కు అతీగతి లేదు. ఒక్కసౌకర్యం అందుబాటులో లేదు. డాక్టర్లు లేరు. సిబ్బంది లేదు. పరికరాలు లేవు. కాని వాటికి రూపాయి ఇచ్చింది లేదు. సౌకర్యాల కల్పన చేసింది లేదు. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రూపాయి విదిల్చింది లేదు. రాష్ట్ర ప్రభుత్వం కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు పైసా సాయం చేసింది లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇచ్చింది లేదు. మిషన్‌ భగీరధకు సహకరిస్తామని చెప్పి, చేసింది లేదు. పైసా పంపింది లేదు…పెండిరగ్‌ నిధులు ఇస్తున్నది లేదు…ఇన్ని రకాల మోసాలు కళ్లముందు వుండగా తెలంగాణ ప్రజలు బిజేపిని ఎలా నమ్ముతారు? ఇంకా ఎంత కాలం మాయ మాటలతో మభ్యపెడతారు? తెలంగాణ అభివృద్దికి ఏ మాత్రం సహకిరంచినా ఇక్కడ ఎన్నో అధ్భుతాలు ఆవిషృతయ్యేవి. కాని చేయలేదు. తెలంగాణపై శీతకన్నేశారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మీదే ఆది నుంచి ప్రధాని మోడీ విషం చిమ్ముతున్నారు… తల్లిని చంపి బిడ్డను బ్రతికించారంటూ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా 2014 ఎన్నికల సందర్భంగా ఓట్లకోసం చెప్పిందెవరు? అదే మాట మరోసారి నిండు లోక్‌ సభలో మరో మారు చెప్పిందెవరో లోకానికి తెలియదా? ఆఖరుకు ఈ మధ్యే పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారంటూ మరోసారి తన అక్కసును తెలంగాణ మీద వ్యక్తం చేసింది ఎవరో ప్రజలు చూడడం లేదా? ఇంకా ఎంత కాలం నమ్మించాలని ప్రయత్నం చేస్తారు? ఇప్పటి వరకు ఏనాడైనా తెలంగాణ ప్రజలమీద ప్రేమ పూర్వకమైన మాటలైనా మాట్లాడారా? శాంతియుత వాతావరణంలో వున్న తెలంగాణలో కొట్లాటను తెస్తామంటున్నారే గాని, ప్రగతిని ఆవిష్కరిస్తామని చెప్పడం లేదు. ఇది చాలు బిజేపి మీద తెలంగాణ ప్రలజకున్న క్లారిటీ…బిజేపిని దగ్గరకు రానీయకుండా చేయడానికి…

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version