– అంగన్వాడీలు, రేషన్ షాపుల తనిఖీ
– ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందాలనేదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం
– రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి
ధర్మసాగర్, నేటిధాత్రి:
రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని పుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. బుధవారం ధర్మసాగర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన అమలు తీరు, రేషన్ డీలర్ల ద్వారా అందుతున్న సేవలను ఫుడ్ కమిషన్ చైర్మెన్ పరిశీలించారు.

ఈ సందర్భంగా తిరుమల్రెడ్డి మాట్లాడుతూ 2011 నుంచి రాష్ట్రంలో అమలవుతున్న ఆహార భద్రతా చట్టంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతోపాటు హక్కులకు భంగం కలుగకుండా చూడడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు. చట్టం అమలు తీరు, లబ్ధిదారుల సమస్యలపై ప్రత్యక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. వాటిని ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులు పరిష్కరించాలని ఆదేశించామన్నారు. ప్రతి విద్యార్థికీ పౌష్టికరమైన ఆహారం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు సరైన పోషకాహారం అందించాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. మెనూ ప్రకారం సరుకులు, గుడ్డు, పాలు అందించాలన్నారు. రేషన్షాపుల్లో ఏఏ కార్డు ద్వారా ఎన్ని కిలోల బియ్యం ఇవ్వాలో అంతే ఇవ్వాలన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ చంద్ర ప్రసాద్, జిల్లా పరిషత్ కోఆప్టెడ్ మెంబర్ జుబేదాలాల్ మహ్మద్, ఎంపీటీసీలు రొండి రాజు, జాలిగపు వనమాల, బొడ్డు శోభ సోమయ్య, ఎమ్మార్వో రాజు, పీడీ సబిత, శ్రీనివాస్, ఎంపీడీవో జవహర్ రెడ్డి, అంగన్వాడీ సూపర్ వైజర్ అరుణ, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు.
