raithu samagra serveylo vivaralu namodu chesukovali, రైతు సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలి

రైతు సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలి

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర రైతు సర్వేలో నూతన పట్టాదారు పాస్‌ పుస్తకం పొందిన ప్రతి రైతు వివరాలను నమోదు చేసుకోవాలని ఏఈవో కావ్య తెలిపారు. రైతు సమగ్ర సర్వేలో భాగంగా బుధవారం మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో స్థానిక గ్రామ పంచాయితిలో రైతులకు సమగ్ర సర్వే నమూనాలు అందించి వివరాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 30 వరకు ఈ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్వేలో రైతుల భూములకు సంబంధించిన నీటి వసతులు, భూముల రకాలతోపాటు రైతుల ఆధార్‌, మొబైల్‌ నంబర్ల, బ్యాంక్‌ పాసు పుస్తకం జిరాక్సులను ప్రధానంగా సేకరిస్తున్నట్లు తెలిపారు.

21na sravs advaryamlo 10k run, 21న ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఆధ్వర్యంలో 10కె రన్‌

21న ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఆధ్వర్యంలో 10కె రన్‌

ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఫిట్‌నెస్‌ జోన్‌ ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన 10కె మారధన్‌ రన్‌ నిర్వహిస్తున్నామని నిర్వాహాకురాలు స్రవంతిరెడ్డి తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఫిట్‌నెస్‌ జోన్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ ఐఎంఎ, బంధన్‌ సెరిమిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సౌజన్యంతో ఈ 10కె రన్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రన్‌ ఈనెల 21వ తేదీ ఉదయం 5.30గంటలకు సుబేదారి ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియం నుండి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ రన్‌లో పాల్గొనదలిచిన వారు 500రూపాయలు చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. పాల్గొన్న వారికి టి-షర్లు, బిడ్‌ నెంబర్‌, సర్టిఫికేట్‌, మెడల్‌, పండ్ల రసాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ హాజరవుతారని తెలిపారు. ఈ రన్‌లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 10వేల రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5వేల రూపాయలు, తృతీయ బహుమతిగా మూడువేల రూపాయలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ఆదాయాన్ని తలసేమియా బాదితులకు అందజేస్తామని ఐఎంఎ రెసిడెంట్‌ నల్ల సురేందర్‌రెడ్డి, బంధన్‌ డైరెక్టర్‌ శ్రవన్‌, స్రవంతిరెడ్డి, టీంసభ్యులు సంగీతనాయుడు, మాధవి తెలిపారు.

మార్కెట్లో కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి.

మార్కెట్లో కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి.

నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో హమాలి, కూలి గంప, చీపురు కార్మికులకు కనీస వసతులు కల్పించాలని టీఆర్‌ఎస్‌ కెవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. బుదవారం తెలంగాణ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ టీఆర్‌ఎస్‌ కేవీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్‌ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున కార్మికులు భోజనం చేయడానికి తీసుకువచ్చిన భోజనాలు ఎత్తుకు వెళ్తున్నాయని, వాటి రక్షణకోసం కార్మికులు సామానులు భద్రపరుచుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక విశ్రాంతి గది ఏర్పాటు చేయాలని, హామాలి కార్మికులకు సైకిల్‌ స్టాండ్‌ ఏర్పాటు చేయాలని, మహిళ కార్మికులు మూత్రవిసర్జనకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రత్యేక మూత్రశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. రాత్రివేళలో కాంటాలు జరుగుతున్నందున యార్డులో విద్యుత్‌ లైట్స్‌ లేక ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించాలని చైర్మన్‌ను కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్‌ జిల్లా ఇంచార్జి కొల్లూరి లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు పాలడుగు రమేష్‌, డివిజన్‌ అధ్యక్షులు బలం ప్రసాద్‌, కార్మికులు మాదాసి భారతమ్మ, ఈశ్వరమ్మ, చిలకమ్మతోపాటు తదితరులు పాల్గొన్నారు.

batasarulaku basataga chalivendram, బాటసారులకు బాసటగా చలివేంద్రం

బాటసారులకు బాసటగా చలివేంద్రం

చలివేంద్రం బాటసారుల దాహార్తిని తీర్చుతూ బాసటగా నిలుస్తుందని ఆడెపు రవీందర్‌ అన్నారు. బుధవారం వరంగల్‌ మట్టెవాడలోని బాలాజీ స్వచ్చంధ సేవా సంస్థ వ్యవస్థాపకులు తోట హైమావతి, భూమయ్య గత 8సంవత్సరాలుగా చలివేంద్రం వేసవికాలంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆడెపు రవీందర్‌ హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాటసారులకు చవివేంద్రం బాసటగా ఉంటుందని అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చాలామంది బాటసారుల దాహార్తిని తీర్చడానికి ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు రచయిత, దర్శకుడు టి.వి.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఎండాకాలంలో దాహార్తులు మంచి పరిశుభ్రమైన నీటిని సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, డీహైడ్రేషన్‌ కాకుండా చూసుకోవాలని, కనీసం ఎక్కువ నీటిని సేవించాలని అన్నారు. భూమయ్య, హైమావతిలు మాట్లాడుతూ బాటసారుల దాహార్తిని తీర్చడం ఎంతో తృప్తిని కలిగిస్తుందని తెలిపారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సరళాదేవి, ఉషారాణి, రాజేశ్వర్‌రావు, కృష్ణమూర్తి, శ్రీదేవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

vidinirvahanalo alsathvam vahiste cheryalu thappavu, విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిరిసిల్ల రాజన్న జిల్లా పురపాలక సంఘం కమీషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని 1,2వ వార్డులలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, ఇతర మౌళిక వసతులను ఆయన పర్యవేక్షించారు. వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగాలేకపోవడంతో సానిటరీ ఇన్‌స్పెక్టర్‌, సానిటరీ జవాన్లను 500రూపాయల జరిమానా విధించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, తిరిగి పునరావృతమైతే విధుల నుంచి తొలగిస్తానని హెచ్చరించారు. పట్టణంలోని ఖాళీ స్థలాల యజమానులకు స్థలాలలో చెత్తచెదారం, పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలని నోటీసులు జారీ చేయాలని టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, లింక్‌రోడ్ల వద్ద ప్యాచ్‌ వర్క్‌లు త్వరగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్‌ సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యానగర్‌లో నిర్మాణం పూర్తికాబోతున్న మిషన్‌ భగీరథ ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ను సందర్శించి, నేడు సాయంత్రానికి పురపాలక సంఘానికి అప్పగించాలని, రోడ్‌ రిస్టోరేషన్‌ పనులు నాణ్యతాయుతంగా త్వరగా పూర్తి చేయాలని సంబంధిత డిఇ, ఇంజనీర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో 1,2వ వార్డుల కౌన్సిలర్లు రాగుల జగన్‌, బుర్ర నారాయణగౌడ్‌, పురపాలక సంఘ కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

eddaru vrudulapia gurthuteliyani dundagula dadi, ఇద్దరు వృద్దులపై గుర్తుతెలియని దుండగుల దాడి

ఇద్దరు వృద్దులపై గుర్తుతెలియని దుండగుల దాడి

– ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌ గ్రామంలో దారుణం జరిగింది. ఇద్దరు వద్ధులపై గుర్తు తెలియని దుండగులు అమానుషంగా దాడి చేశారు. దీంతో ఒక వద్ధుడు మతి, మరో వద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగులను తొందరలోనే పట్టుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

rashtra prabuthvam vadda raithu samacharam purthisthailo ledu, రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతు సమాచారం పూర్తిస్థాయిలో లేదు

రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతు సమాచారం పూర్తిస్థాయిలో లేదు

రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతుల పూర్తి సమాచారం అందుబాటులో లేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమగ్ర సమాచార సర్వేలో పాల్గొని పూర్తిస్థాయిలో సహకరించి విజయవంతం చేయాలని నర్సంపేట వ్యవసాయ శాఖ ఏడిఏ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలకేంద్రంతోపాటు రేకంపల్లి, లక్ష్మీపురం, తిమ్మంపేట గ్రామాలలో రైతు సమగ్ర సమాచార సర్వేను మండల వ్యవసాయ శాఖ అధికారి చిలువేరు దయాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామాలలో నిర్వహించిన రైతు సమగ్ర సమాచార సర్వే కార్యక్రమానికి ఏడీఏ శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలోని రైతులు పండించే పంటలు, పంటల గిట్టుబాటు ధరలు, భూములు ఉన్నప్పటికీ రైతు బంధు చెక్కులకు సంబంధించిన వివరాలు, పంట భూములకు సంబంధించిన వివరాల పట్ల రెవెన్యూ శాఖలో అనేక ఇబ్బందులు పెడుతున్న విధానం పట్ల వ్యవసాయశాఖ అధికారులతో విన్నవించుకున్నారు. రైతు సమగ్ర సమాచార సర్వేలో ప్రతి రైతు పాల్గొని తమ పట్టా పాసు పుస్తకాలు, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాసుబుక్‌ జిరాక్సులను అందించాలన్నారు. రెవెన్యూ శాఖలో పలు అంశాలు త్వరలో పరిష్కారం కానున్నాయని తెలిపారు. రైతులు పండించే వివిధ పంటలకు నష్టం వాటిల్లకుండా వాతావరణ బీమా పథకంలో ప్రతి రైతు చేరాలన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి దయాకర్‌ మాట్లాడుతూ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నదని తెలిపారు. రైతుల అభివద్ధి కోసం మండల శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ విస్తీర్ణ అధికారులు రాజేష్‌, మాలోతు హనుమంతునాయక్‌, మోడెం విశ్వశాంతి గౌడ్‌, మధు, సర్పంచ్‌లు మోడీ విద్యాసాగర్‌ గౌడ్‌, తోకల మంజుల, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ తోకల నర్సింహారెడ్డిలతోపాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

conductorla ikya vedikanu vijayavantham cheyali, కండక్టర్ల ఐక్య వేదికను విజయవంతం చేయాలి

కండక్టర్ల ఐక్య వేదికను విజయవంతం చేయాలి

సిద్దిపేట పట్టణంలో రేపు జరిగే ఆర్టీసీ కండక్టర్ల ఐక్య వేదిక (ఆత్మీయుల సమ్మేళనం) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నర్సంపేట ఆర్టీసీ డిపో మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నాగిశెట్టి ప్రవీణ్‌, గొలనకొండ వేణులు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులు, ఆర్టీసీ కండక్టర్లు పోరాటం చేసినా నేడు ఫలితం లేకుండా పోయిందని, ఏదో ఒక కారణంతో ఉద్యోగాలు తొలగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చర్చించి ఉద్యోగులకు సంపూర్ణ భద్రత కల్పించాలని ప్రకటన ద్వారా కోరారు. రేపు సిద్దిపేటలో జరిగే కండక్టర్ల ఐక్య వేదికను విజయవంతం చేయాలని అన్నారు.

raithulu samagra serveyku sahakarinchali, రైతులు సమగ్ర సర్వేకు సహకరించాలి.

రైతులు సమగ్ర సర్వేకు సహకరించాలి.

ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వేలో ప్రతి రైతులు తప్పక సహకరించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి దయాకర్‌ అన్నారు. మంగళవారం దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి, అడవి రంగాపురం, రేబల్లె, నాచినపల్లి గ్రామాలలో రైతు సమగ్ర సమాచార సర్వేను వ్యవసాయ శాఖ అధికారి దయాకర్‌ ప్రారంభించారు. పంటలు, భూముల రకాలు, పాడి పశువుల వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా దయాకర్‌ మాట్లాడుతూ రైతు సమగ్ర సేకరణ సర్వేలో ప్రతి ఒక్కరూ తమ పట్టా పాసు పుస్తకాలు, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్సులను అందించి సమగ్ర సర్వేలో నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ విస్తీర్ణ అధికారులు మాలోతు హనుమంతునాయక్‌, రాజేష్‌, విశ్వశాంతి, మదుతోపాటు గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

akrama matti tharalimpulapia cheryalu thisukovali, అక్రమ మట్టి తరలింపులపై చర్యలు తీసుకోవాలి

అక్రమ మట్టి తరలింపులపై చర్యలు తీసుకోవాలి

ఊరచెరువులలో ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్ను నర్సయ్య డిమాండ్‌ చేశారు. అక్రమ మట్టి తరలింపులను అడ్డుకుని చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మహేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామం, నెక్కోండ మండలం బంజరుపల్లి, నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామాల్లో అక్రమమట్టి తరలింపులు జరుగుతున్నప్పటికీ సంబందిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే అక్రమ మట్టి తరలింపులు ఆపి వారిపై చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

mayor pitampai jhansi, మేయర్‌ పీఠంపై ఝాన్సీ…?

మేయర్‌ పీఠంపై ఝాన్సీ…?

గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా కొనసాగి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్‌ ఎన్నిక కావడంతో వరంగల్‌ మేయర్‌ స్థానం ఖాళీ అయింది. దీంతో నూతన మేయర్‌ను ఎన్నుకునేందుకుగాను ఈనెల 23న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 27న నూతన మేయర్‌ను ఎన్నుకోనున్నారు. మేయర్‌ పీఠం కోసం వరంగల్‌లో ప్రస్తుతం నాలుగుస్తంభాలాట కొనసాగుతోంది. ఈ పదవి కోసం 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుండా ప్రకాష్‌, 27వ డివిజన్‌ కార్పొరేటర్‌ వద్దిరాజు గణేష్‌, 56వ డివిజన్‌ కార్పొరేటర్‌ నాగమల్ల ఝాన్సీలక్ష్మి, 28వ డివిజన్‌ కార్పొరేటర్‌ యెలగం లీలావతి పోటీపడుతున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్‌లో టిఆర్‌ఎస్‌కు పూర్తి మెజార్టీ ఉండగా ఎన్నిక లాంఛనమే కానుంది. అయితే మేయర్‌ పీఠాన్ని ఎవరూ దక్కించుకోనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మేయర్‌ పీఠం కోసం నలుగురు కార్పొరేటర్లు పోటీ పడుతున్నా మేయర్‌ పీఠం మాత్రం 56వ డివిజన్‌ కార్పొరేటర్‌ నాగమల్ల ఝాన్సీకి ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు అధిష్టానం సైతం సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఝాన్సీకే మద్దతు పలుకుతున్నట్లు తెలిసింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ సైతం ఝాన్సీకి మేయర్‌ పదవి పొందేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పోటీలో ఎంతమంది ఉన్నా చివరకు పదవి మాత్రం ఝాన్సీనే వరిస్తుందని గులాబీ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతోంది. అయితే ఈ పదవిని దక్కించుకునేందుకు మిగతా కార్పొరేటర్లు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఎవరెన్నీ ప్రయత్నాలు చేసినా మేయర్‌గా ఝాన్సీని టిఆర్‌ఎస్‌ అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలిసింది.

ennikalaku highcourt greensignal, ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలకు మంగళవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలను ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. పంచాయతీ రాజ్‌ యాక్ట్‌ 285ఏ సెక్షన్‌ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 50శాతం లోబడే ఉండాలని చెపుతుందని తెలిపింది. ఎలక్షన్‌ కమిషన్‌, పంచాయితీ రాజ్‌ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ, ఎన్నికల సంఘానికి, తెలంగాణ బిసి కార్పొరేషన్‌, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

asathya pracharalu cheste kesule, అసత్య ప్రచారాలు చేస్తే కేసులే

అసత్య ప్రచారాలు చేస్తే కేసులే

– రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌

సోషల్‌ మీడియాలో ఇవిఎంల గురించి అసత్య ప్రచారాలు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ హెచ్చరించారు. గత కొద్దికాలంగా ఇవిఎంలపై సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న విషయాలను ఆయన ఖండించారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి విఘాతం కలిగేలా కొందరు సోషల్‌ మీడియాలో ఈసీపై దుష్ప్రచారం చేస్తున్నారని రజత్‌కుమార్‌ మండిపడ్డారు. పోలింగ్‌ శాతాలతోపాటు పలుచోట్ల ఇవిఎంల తరలింపు తదితర అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నట్టు స్పష్టం చేశారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే సాయంత్రం 5గంటలకు అంచనా వివరాలు ఇస్తామని.. తర్వాతి రోజు మాత్రమే పోలింగ్‌ శాతాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలమని పేర్కొన్నారు. పోలింగ్‌ ముగిసే ముందు ఫారం 17సీ కాపీలు పోలింగ్‌ ఏజెంట్లకు అందిస్తామని..దానిపై వాళ్ల సంతకాలు సైతం ఉంటాయని అన్నారు. ఫారం 17ఏ, ఫారం 17సీని సరిచూసుకున్న తర్వాత కూడా అనవసర రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. జగిత్యాలలో ఆటోలో తరలించిన ఇవిఎంలు శిక్షణ కోసం వినియోగించినవేనని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కల్పిత కథనాల వల్ల ప్రతిఒక్కరికీ అనుమానాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇవిఎంలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌లో ఫొటోలు తీసుకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆ వ్యక్తిపై న్యాయ విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.

 

4va anthasthu nunchi duki vidhyarthini atmahatya, 4వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

4వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

రాయదుర్గం, నేటిధాత్రి : హైదరాబాద్‌ మణికొండ చిత్రపురికాలనీలో ఇంటర్‌ విద్యార్థిని భవనం నాలుగో అంతస్తు పైనుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. చిత్రపురికాలనీలో నివసించే ఇందుశ్రీ (18) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల తన ఇందుశ్రీ బాబాయి కుమార్తె ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఇందుశ్రీ తన తల్లిదండ్రులతో కానీ, కుటుంబ సభ్యులతోగానీ చెప్పలేదు. శనివారం ఈ విషయం తెలుసుకున్న ఇందుశ్రీ తండ్రి తమకెందుకు చెప్పలేదంటూ మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇందుశ్రీ ఎల్‌ఐజీ బ్లాక్‌-18లో నాలుగో అంతస్తు పైనుంచి కిందకి దూకింది. తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

mulugu rajakiya terapie senior journalist, ములుగు రాజకీయ తెరపై సీనియర్‌ జర్నలిస్టు

ములుగు రాజకీయ తెరపై సీనియర్‌ జర్నలిస్టు

నేటిధాత్రి బ్యూరో : ములుగు జిల్లా రాజకీయకాలు ఇక రసవత్తరంగా మారనున్నాయి. ప్రాదేశిక ఎన్నికలకు ఓ వైపు రంగం సిద్ధమవుతుండడంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలై ఉన్నారు. తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగేందుకు పావులు కదుపుతున్నారు. ములుగు జిల్లా నూతనంగా ఏర్పడటంతో ఇక్కడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిపై ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం జడ్పీ చైర్మన్‌ పదవి జనరల్‌ కావడంతో ఈ పీఠాన్ని కైవం చేసుకోవడానికి పలువురు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

రాజకీయాల్లోకి సీనియర్‌ జర్నలిస్ట్‌

గత రెండు దశాబ్ధాలుగా ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాలో జర్నలిస్టుగా సేవలందించిన సీనియర్‌ జర్నలిస్టు తుమ్మ శ్రీధర్‌రెడ్డి ప్రాదేశిక ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనరల్‌ స్థానం కావడంతో ఏటూరునాగారం జడ్పీటిసిగా పోటీచేసి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ములుగు జిల్లాలో విస్తృతమైన సంబంధాలు కలిగిన శ్రీధర్‌రెడ్డి ములుగు రాజకీయ తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటి వరకు ప్రయత్నాలలో తుమ్మ శ్రీధర్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నట్లు తెలియవచ్చింది. అందరిని సమన్వయం చేసుకుంటూ గెలుపు గుర్రం ఎక్కేందుకు ఇప్పటికే ఆయన పని చేసుకుంటూ పోతున్నట్లు తెలిసింది.

గులాబీ అధిష్టానం ఆశీస్సులు

ములుగు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనరల్‌ స్థానం కావడంతో అధికార పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది. అయితే ఈ సంఖ్య విషయం ఎలా ఉన్న అత్యధికులు తుమ్మా శ్రీధర్‌రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే అధిష్టానాన్ని సైతం సంప్రదించిన ఆయన హామీ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ములుగు జిల్లాలో స్థానికంగా బలం ఉన్న నాయకుడి కోసం చూస్తున్న గులాబీ బాస్‌ శ్రీధర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీధర్‌రెడ్డి ఈ స్థానం కోసం బరిలో దిగితే జర్నలిస్టుల నుంచి సైతం సంపూర్ణ మద్ధతు లభించే అవకాశం ఉన్నందున గులాబీ బాస్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ సైతం స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా, టియుడబ్ల్యుజె (ఐజెయు) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ శ్రీధర్‌రెడ్డి జర్నలిస్టు యూనియన్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇవన్నీ అతనికి కలిసివస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సమీకరణాల నేపథ్యంలో అధికార పార్టీ నుంచి టికెట్‌ ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.

thiragabadda voterlu…, తిరగబడ్డ ఓటర్లు…!

తిరగబడ్డ ఓటర్లు…!

ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామరైతులు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్‌ను బహిష్కరించి రెవెన్యూ అధికారులపై తిరగబడ్డారు. గ్రామంలో గత 80సంవత్సరాలుగా తాత, ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను 200ఎకరాల భూములు మావి కాదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే పేరుతో స్థానిక విఆర్వో తమను వేధిస్తున్నాడని, తాము సాగు చేసుకుంటున్న భూముల్లో జెండాలు పాతించి ఇవి ప్రభుత్వ భూములని చెప్పి తమకు జీవనాధారం లేకుండా చేస్తున్నాడని గ్రామస్తులు అంటున్నారు. రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ గ్రామంలో ఓటింగ్‌ను బహిష్కరించి ధర్నాకు దిగారు. తమ సమస్యను పరిష్కరించేంత వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. గ్రామస్తులంతా ఏకమై ఓటింగ్‌ను బహిష్కరించడంతో పోలింగ్‌ కేంద్రం మొత్తం బోసిపోయింది. మధ్యాహ్నం వరకు ఓటు వేసే వారు లేక పోలింగ్‌ సిబ్బంది ఓటర్ల కోసం ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చున్నారు.

బుజ్జగించిన తహశీల్దార్‌

గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించిన విషయం తెలుసుకున్న నూగూరు వెంకటాపురం తహశీల్దార్‌ గ్రామానికి చేరుకుని గ్రామస్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ట్రైబల్‌ ఏరియాలో నాన్‌ట్రైబ్‌కు భూమి ఇచ్చే రూల్‌ లేదని ప్రభుత్వం ఎలా చెపితే తాను అలా చేస్తానని, విఆర్వోను తాను జెండాలు పాతమని చెప్పలేదని గ్రామస్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు మాత్రం గత 80సంవత్సరాలుగా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వ భూములు ఎలా అవుతాయని ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం సాగు చేసుకుంటున్న గిరిజనేతరుల భూములను తాము స్వాదీనం చేసుకోమని తహశీల్దార్‌ హామీ ఇచ్చారు. ఇక ముందు గిరిజనేతరులు ఎవరు భూములను ఆక్రమించుకోకూడదని సూచించారు. అయినా రైతులు శాంతించలేదు. దీంతో జోక్యం చేసుకున్న వెంకటాపురం ఎస్సై తిరుపతి సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని, తాను సహకరిస్తానని ఓటు వేయాలని కోరడంతో రైతులు శాంతించారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారు

– శేషగిరిరావు, రైతు

బెస్తగూడెం గ్రామంలోని 200ఎకరాల్లో విఆర్వో రాజేందర్‌ జెండాలు పాతించి తమను వేధిస్తున్నాడని గ్రామ రైతు శేషగిరిరావు ఆరోపించారు. ఈ విషయం తహశీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే అవి గిరిజనుల భూములు మీరు చచ్చిపోండని బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెస్తగూడెం గ్రామానికి చెందిన అనేకమంది రైతులు గత 80సంవత్సరాలుగా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం తమను కరుణించి సమస్య పరిష్కారం చేయాలన్నారు.

 

encounter chesthava…, ఎన్‌కౌంటర్‌…చేస్తావా…?

ఎన్‌కౌంటర్‌…చేస్తావా…?

వరంగల్‌ పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, పరకాల సీఐ మధు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన స్వగ్రామం అయిన పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో సీఐ టిఆర్‌ఎస్‌కు సహకరించాడని దొమ్మాటి సాంబయ్య ఆరోపించారు. తమ కార్యకర్తలను ఎందుకు బూతులు తిడుతున్నావని గ్రామంలో విధులు నిర్వహిస్తున్న సీఐతో దొమ్మాటి వాగ్వాదానికి దిగాడు. గ్రామంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేసిన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించాడు. దీంతో సీఐ తాను ఎవరిని దూషించలేదని స్పష్టం చేశారు. దొమ్మాటి సీఐతో వాగ్వాదానికి దిగుతూనే కలెక్టర్‌కు ఫోన్‌ చేసి రాతపూర్వకంగా తాను ఫిర్యాదు చేస్తానని సీఐ మధు అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. దీంతో మరోసారి కలగజేసుకుని సీఐ తాను అమర్యాదగా ఎంతమాత్రం ప్రవర్తించలేదని, వీడియో సాక్ష్యాలు ఉన్నాయన్నారు. సీఐ వివరణతో సంతృప్తి చెందని దొమ్మాటి ఎన్‌కౌంటర్‌ చేస్తావా…? చెయ్యి అంటూ ముందుకు వెళ్లారు. తాను అలా అనలేదని సీఐ చెప్పిన అదేం పట్టించుకోని దొమ్మాటి తీవ్ర స్వరంతో సీఐతో వాగ్వాదానికి దిగారు.

 

police sibbandipie suspention veetu,పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

ఎన్నికల విధులకు గైర్హాజరయిన ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేసారు. సస్పెషన్‌ వేటుకు గురైయిన వారిలో యు.రాజు సుబేదారి పోలీస్‌స్టేషన్‌, వి.నిరంజన్‌ సంగెం పోలీస్‌ స్టేషన్‌, ఇ.గణేష్‌ సిటి గార్డ్స్‌, కె.ఉపేందర్‌ కమలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌, డి.శ్రీనివాస్‌ రఘనాధ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందినవారు వున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్బంగా సెలవుల్లో వున్న 69మంది సిబ్బంది తక్షణమే విధుల్లో చేరి ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి వుంది. ఇలా సెలవులో వెళ్లిన వారికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అదేశాల మేరకు సెలవులో వున్న పోలీస్‌ సిబ్బంది తక్షణమే ఎన్నికల విధుల్లో చేరిపోవాలని సంబంధిత పోలీస్‌స్టేషన్ల ద్వారా నోటీసులను సైతం జారీచేశారు. అందులో 64మంది సిబ్బంది తిరిగి విధుల్లో చేరగా ఈ నోటీసులకు స్పందించకుండా ఎన్నికల విధుల్లో చేరేందుకు రాకుండా ఆలసత్వంతో వ్యవహరించిన మిగితా ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్ల తీరుపై ఎన్నికల కమీషన్‌ నియమాలను అనుసరించి సదరు ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్ళను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

……………………………………………….

parlament ennikalaku kattudettamaina bhadratha erpatlu

పార్లమెంట్‌ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

-వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌

వరంగల్‌ క్రైం, నేటిధాత్రి : పార్లమెంట్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సుమారు ఐదువేల మంది పోలీసులను ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తున్నామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. ఈనెల 11వ తేదీన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరగబోయే ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి బుధవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌తోపాటు పాక్షికంగా వున్న మహబూబాబాద్‌, కరీంనగర్‌, భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలను ప్రశాంతవంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు ప్యూహత్మకమైన ప్రణాళికను రూపోందించామని చెప్పారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 2127పోలింగ్‌ కేంద్రాలు 1053 ప్రాంతాల్లో వున్నాయని, అందులో 246 సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్లుగా గుర్తించామన్నారు. ఈ మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 234మార్గాల్లో ఏర్పాటు చేయబడ్డాయని, ఇందుకు సంబంధించి పోలీస్‌శాఖ తరుపున అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్డ్‌ ప్రకటించిన నాటి నుండే నియోజకవర్గం వారిగా స్టాటిక్‌ సర్వేలేన్స్‌ ప్లయింగ్‌ స్క్వాడ్‌ బందాలు గత రెండు నెలలకాలంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఈ బందాలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పంపణీ చేసే డబ్బు, మద్యంతో చట్ట వ్యతిరేకమైన అయుధాలను నియంత్రించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా గత రెండునెలల నుండి 8 సంఘటనల్లో 58,29,860రూపాయల డబ్బును సీజ్‌ చేయడంతోపాటు, 1523 కేసుల్లో 9302మందిని బైండోవర్‌ చేశామని చెప్పారు. ఇందులో రౌడీ షీటర్లు, బెల్టుషాపు నిర్వాహకులు, అనుమానితులతోపాటు గతంలో ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడిన వారు వున్నారని, అధేవిధంగా వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రభుత్వ అనుమతులు వున్న 143తుపాకులు సంబంధిత పోలీస్‌స్టేషన్లలో డిపాజిట్‌ చేయగా, మరో 79 తుపాకులు బ్యాంక్‌ సెక్యూరిటీగార్డుల వద్ద వున్నాయని, రెండునెలల నుండి పెండింగ్‌లో వున్న 133 నాన్‌-బెయిల్‌బుల్‌ వారెంట్లలోని నిందితులను కోర్టుకు హాజరుపర్చామని అన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్‌కు సంబంధించి 74 కేసులు నమోదు చేయడంతోపాటు, 3,31,695రూపాయల విలువ గల 1144లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నేరస్థుల నియంత్రణలో భాగంగా పోలీస్‌ మిషనరేట్‌ పరిధిలో మొత్తం 58మంది నిందితులపై పీడీ యాక్ట్‌ కింద కేసులను నమోదు చేయబడ్డాయని, ఇక ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 10కేసులు నమోదయ్యాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ ఎన్నికల బందోబస్తుకు సంబంధించి తొలిసారిగా పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని, ఎన్నికల బందోబస్తు కోసం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన పోలీస్‌ సిబ్బందితోపాటు ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలను ఎన్నికల నిర్వహణకు వినియోగిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రతి ఓటరు తమ హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని, అలాగే ఎవరైనా ఎన్నికలకు ఆటంకంపర్చడం గానీ, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్టయితే వారిపై కఠినంగా వ్యవహరించడంతోపాటు వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు నేరచరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి పీడీ యాక్ట్‌ నమోదుచేస్తామని కమిషనర్‌ హెచ్చరించారు.

……………………………………………….

votuku velaye, ఓటుకు వేళాయే…

ఓటుకు వేళాయే…

– ఓటింగ్‌కు సర్వం సిద్దం చేసిన ఎన్నికల కమీషన్‌

– పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది

– కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసుశాఖ

– ఎన్నికల విధులకు గైర్హాజరైన పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

– ప్రత్యేక రైళ్లను కేటాయించిన రైల్వేశాఖ

– సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

నేటిధాత్రి బ్యూరో : మొదటిదశ పార్లమెంట్‌ ఎన్నికలకు సర్వం సిద్దమయింది. మరికొద్ది గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఉదయం 8గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్‌ సాయంత్రం 5గంటలకు ముగియనుంది. పోలింగ్‌ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ఎన్నికల కమీషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. వివిధ పోలింగ్‌ కేంద్రాలలో పోలింగ్‌ సరళిని పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం పోలింగ్‌ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వేసవికాలం అయినందున పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎండ తీవ్రతను తగ్గించేందుకు చలువ పందిళ్లు, షామియానాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు పోలింగ్‌ సిబ్బంది బుధవారం ఉదయమే వివిధ పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో పోలీస్‌శాఖ అదనపు భద్రత ఏర్పాట్లను చేసింది.

మొదటి దశకు అంతా సిద్ధం

లోక్‌సభ మొదటి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాజకీయ నేతల భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో ఓట్ల ద్వారా దేశ ప్రజలు తీర్పునివ్వనున్నారు. దేశంలోని 543 స్థానాల్లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 11న (గురువారం) దేశంలోని మొత్తం 91 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలను సిద్ధం చేశారు. అవి మొరాయిస్తే వెంటనే సరిచేయడానికి నిపుణులను నియమించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 25, తెలంగాణలోని 17, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 2, అసోంలోని 5, బిహార్‌లోని 4, ఛత్తీస్‌గఢ్‌లోని 1, జమ్ముకశ్మీర్‌లోని 2, మహారాష్ట్రలోని 7, మణిపూర్‌లోని 1, మేఘాలయలోని 2, మిజోరంలోని 1, నాగాలాండ్‌లోని 1, ఒడిశాలోని 4, సిక్కింలోని 1, త్రిపురలోని 1, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8, ఉత్తరాఖండ్‌లోని 5, పశ్చిమ్‌బెంగాల్‌లోని 2, లక్షద్వీప్‌లోని 1, అండమాన్‌ నికోబార్‌లోని 1స్థానాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయి.

అసెంబ్లీ ఎన్నికలు..

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయి.

ఒడిశాలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలు 147 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటికి ఏప్రిల్‌ 11, 18, 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌లో 2 లోక్‌సభ స్థానాలు 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటన్నింటికీ గురువారం ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి.

సిక్కింలో ఒక లోక్‌సభ స్థానం, 32శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటికీ గురువారం ఒకేదశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎన్నికల వేళ.. 36 ప్రత్యేక రైళ్లు!

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. వేలాదిమంది ప్రయాణికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్వస్థలాలకు బయలుదేరారు. ఈ సందర్భంగా దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో సతీష్‌ మాట్లాడుతూ ప్రతిరోజు హైదరాబాద్‌ నుంచి ఆంధ్రాకు 40రైళ్లు ప్రయాణిస్తున్నాయని తెలిపారు. ఇవేకాకుండా వేసవి, ఎన్నికల రద్దీ దష్ట్యా రానున్న మూడురోజుల్లో ప్రత్యేకంగా 36రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు. గుంటూరు, విజయవాడ, విశాఖకు ప్రతిరోజు 28 రైళ్లు నడుస్తుండగా..రోజుకు 11 రైళ్ల చొప్పున అదనంగా నడపనున్నారు. గుంతకల్‌, కర్నూలు, తిరుపతికి 16 రైళ్లు ఉన్నప్పటికీ అదనంగా 9 రైళ్లు నడుపుతామని తెలిపారు.

తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి…

సీఇఓ రజత్‌కుమార్‌

తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ రాష్ట్ర సిఇఓ రజత్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 15 నియోజకవర్గాలలో పోలింగ్‌ సామగ్రి చేరుకున్నాయని, నిజామాబాద్‌లో సామగ్రి మారుమూల గ్రామాలకు వెళ్ళడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా బుధవారం రాత్రికి పోలింగ్‌ సామగ్రి చేరుకుంటుందని, గురువారం ఉదయం 5.30కి మాక్‌ పోలింగ్‌ ప్రారంభం అవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7గంటల నుండి పోలింగ్‌ ప్రారంభమవుతుందని, నిజమాబాద్‌లో ఉదయం 8నుండి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో 5గంటల వరకు లైన్లో ఉండే వారికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఓటర్‌ స్లిప్‌ ఐడి ప్రూఫ్‌ కాదు..12రకాల గుర్తింపు కార్డులు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవచ్చునని తెలిపారు. 48లక్షల మందికి ఓటర్‌కార్డులు పంపిణీ చేసామని, ఓటరు లిస్ట్‌లో పేరు ఉందో…లేదో చెక్‌ చేసుకోవాలని, ఎపిక్‌ ఉంటే ఓటు ఉన్నట్టు కాదని అన్నారు. ఓటర్లు పోలింగ్‌ బూత్‌లలో మొబైల్‌ అనుమతించబడవని, ఏదైనా ఇబ్బంది కలిగితే తప్ప అక్కడ అధికారి మాత్రమే మొబైల్‌ తీసుకెళ్తారని, కానీ ఎవరూ కూడా పోలింగ్‌ తేదీన మొబైల్‌ తీసుకొని రాకూడదని చెప్పారు.

ఏర్పాట్లు పూర్తయ్యాయి…

నిజామాబాద్‌లో 600మంది ఇంజనీర్లు విధుల్లో ఉంటారని, మొత్తం 2లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై వచ్చిన కంప్లైంట్‌ ఓ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇసిఐ నేడు నోటీస్‌ ఇచ్చిందని, 171 కేసు కింద కొండ సందీప్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యిందని, కానీ కొండ విశ్వేశ్వరరెడ్డికి సంబంధం లేదు అని తాను చెప్పారు…టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఇప్పుడు పిర్యాదు చేసిందని, 55వేల పోలీస్‌ సిబ్బంది పోలింగ్‌ భద్రతలో ఉంటారని, 3లక్షల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. ప్రగతిభవన్‌లో చేరికలు జరుగుతున్నాయని, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారని ఇసిఐకి నివేదించామని, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజామాబాద్‌లో ఒక్కో బూత్‌ లో 12మెషీన్లు వాడుతున్నామని, అదనపు గదులు తీసుకుని మాక్‌ పోలింగ్‌కు ఉపయోగించుకునున్నామని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version