అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
ప్రజా సమస్యలపై ఉదృత పోరాటాలు చేయాలి
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
ఈనెల 30న గట్టుప్పల మండల కేంద్రంలోని ఎస్విఎల్ ఫంక్షన్ హాల్ లో జరిగే అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం గట్టుప్పల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ఉదృత పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాలకులు మారిన ప్రజా సమస్యలు మాత్రం “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే “అన్న చందంగా మారిందని పాలక ప్రభుత్వాలను ఆయన విమర్శించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని ఆయన విమర్శించారు. జిల్లాలో పలుచోట్ల భూ సమస్యలు ఉన్నాయని గత పది సంవత్సరాలుగా ఏ ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదు అని, ఇంటి స్థలాల కోసం ప్రజలు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వ మాత్రం ఇప్పటివరకు పరిష్కరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దున్నే వాడికి భూమి కావాలని, వెట్టి చాకిరి విముక్తి కోసం ఎర్రజెండాలను ఎత్తుకొని వేలాదిమంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాలర్పించారని ఆయన అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మునుగోడు ప్రాంత సిపిఎం నాయకులు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రజా ఉద్యమాలలో అగ్ర బాగాన ఉండి అమరులైనారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు జరపాలని ప్రజలకు నష్టం కలిగించే విధానాలను ఎండగడుతూ అమరవీరుల ఆశయాల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఆయన అన్నారు. మే 20 జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అయన పిలుపునిచ్చారు ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అనర్హులను ఎంపిక చేస్తున్నారని, రాజకీయ జోక్యం లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లుఇవ్వాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. .సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం మాట్లాడుతూ, అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని ఆయన విమర్శించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడ వాడలా ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో కార్మికుల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, మండల నాయకులు బొట్టు శివకుమార్, కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, ఖమ్మం రాములు, టేకుమెట్ల కృష్ణ, రావుల నరసింహ, అచ్చిన శ్రీనివాస్, వల్లూరి శ్రీశైలం, పెదగానినరసింహ తదితరులు పాల్గొన్నారు.