14 nunchi badibaata, 14 నుంచి బడిబాట

14 నుంచి బడిబాట

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలే లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో ఈనెల 14 నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. విద్యార్థులను ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామస్థులు, పజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ రోజువారీగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ధ్యేయంగా జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ నిర్వహించనుంది.

డిజిటల్‌ తరగతుల బోధన…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి వాటిని సంరక్షించడమే ధ్యేయంగా ప్రభుత్వం బడిబాట పేరిట ఏటా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గతంలో వేసవి సెలవుల్లోనూ నిర్వహించినా, ఆ దిశగా కొంత మేర సఫలీకతం అయ్యింది..దీంతో ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభమైన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకుంటూ అయిదేళ్లు నిండిన విద్యార్థులతోపాటు గ్రామాల్లో బడిఈడు పిల్లలను చేర్పించాలని భావిస్తోంది. గతేడాది చాలామంది విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఆంగ్ల మాధ్యమాలను ప్రవేశపెట్టింది. దీంతో కొన్ని గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా..పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో విద్యార్థుల నమోదు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల పట్ల సానుకూలత కనిపిస్తోంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతోపాటు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు ఇందుకు దోహదం చేస్తున్నాయని చెప్పక తప్పదు. మధ్యాహ్న భోజనం, డిజిటల్‌ తరగతులు, ఆంగ్ల మాధ్యమం ఉచితం, సమరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, వివిధ రకాల ఉపకార వేతనాలు అందుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఐదురోజుల పాటు..

జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని ఐదురోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందుకు ఒక్కోరోజు ఒక్కో విధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. బడిబాట మొదటిరోజున ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేయాలని సూచించింది. పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను అట్టహాసంగా చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 11గంటల వరకు పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.

బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి ….

సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా

ఐదు సంవత్సరాలు నిండిన బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట అవగాహన కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. ప్రైవేటు పాటశాలతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలో వసతులు, నాణ్యమైన విద్య విషయం తదితర అన్ని విషయాలలో ప్రభుత్వ పాఠశాలలు మెరుగన్నారు. క్షేత్రస్థాయిలో సంబంధిత ప్రభుత్వ శాఖలు పర్యటించి ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. టార్గెట్‌ బేస్డ్‌ అప్రోచ్‌ తో అధికారులు ముందుకు సాగలన్నారు. జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించాలన్నారు. మధ్యలో బడి మానివేసిన విద్యార్థులను కూడా గుర్తించి పాఠశాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బడిబాటలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతీరోజు ర్యాలీలు నిర్వహించి నమోదును పెంచేందుకు కషి చేయాలన్నారు. విద్యార్థుల నమోదు వివరాలను విధిగా ప్రతీరోజు ఎంఈవో కార్యాలయానికి పంపాలన్నారు. బడి మానివేసిన విద్యార్థుల వివరాలను సేకరించి..అందరూ బడిలో చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 14 నుంచి బడిబాట నిర్వహించాలన్నారు. బడిబాట నిర్వహించే సమయంలో ప్రతిరోజు ఎంతమంది విద్యార్ధులను పాఠశాలల్లో చేర్పించారో పారదర్శకంగా తెలిపేలా పాఠశాల, మండల, జిల్లాస్థాయిలో బడిబాట డెస్క్‌ను తప్పక ఏర్పాటుచేసి ఒక బాధ్యున్ని నియమించాలని ఆదేశాలు అందాయన్నారు. బడిబాట విజయవంతానికి అధికారులు పాటుపడాలన్నారు.

బడిఈడు పిల్లలను గుర్తిస్తాం…

– ధనాలకోట రాధాకిషన్‌, జిల్లా విద్యాధికారి, రాజన్న సిరిసిల్ల

బడిఈడు, బడి బయటి పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేలా అధికారులకు సూచించాం. ఉపాధ్యాయులతో బడిబాట కార్యక్రమం చేపట్టనున్నాం. అంగన్‌వాడీలో ఐదేళ్లు నిండిన పిల్లలను, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేరేలా కషి చేస్తాం. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సైతం పాల్గొనేలా ఉద్యోగులకు వివరించాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *