ఉద్యోగుల ఇష్టారాజ్యం

ఉద్యోగుల ఇష్టారాజ్యం

‘వైద్యారోగ్యశాఖ అస్తవ్యస్తంగా మారింది. ఉద్యోగులు, అధికారులు రింగన పురుగుల్లా వ్యవహరిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారలు విధులకు డుమ్మాకొడుతూ పట్టణంలో తిష్టవేయటం పరిపాటిగా మారింది. శాఖ పరమైన పనులను నిర్లక్ష్యం చేస్తూ సొంత పనుల్లో బిజిబిజి అవటం అధికారులకు, ఉద్యోగులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందనేది గమనార్హం. అడిగే నాధుడు లేడనే రితిలో వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలు కొరవడటంతో ఉద్యోగులు, అధికారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాలకు కేంద్రంగా ఉన్న వెద్యారోగ్యశాఖలోని తంతు’.

జిల్లాల విభజనతో వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాలకు సంబంధిచిన వైద్యారోగ్యశాఖ (డిఎంఅండ్‌హెచ్‌ఓ) ఒకే కార్యాలయంలో కొనసాగుతున్న విషయం విధితమే. అర్బన్‌ జిల్లాతో పాటు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని 16 మండలాల్లో పిహెచ్‌సీలు, నర్సంపేట, పరకాల ప్రాంతాల్లోని ఏరియా ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారులు హన్మకొండ, వరంగల్‌ నగరాల నుంచే ఎక్కువగా అప్‌అండ్‌డౌన్‌ చేయటం బహిరంగరహస్యమే. అయితే డిఎం అండ్‌ హెచ్‌ఓ అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో అప్‌ అండ్‌ డౌన్‌ చేసే అధికారులు, ఉద్యోగులు విధులకు డుమ్మా కొట్టడం, సొంత పనుల పట్ల ఎక్కువగా దృస్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సరి చేయాల్సి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. డిఎం అండ్‌ హెచ్‌ఓ కార్యాలయానికి వెళ్లిన ఎవరికైనా అధికారులు, ఉద్యోగలు నిర్లక్ష్య వైఖరి, కార్యాలయ తీరు ఇటే తెలిసిపోతుందని పలువురు వాఖ్యానిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారలు సరిగా దృష్టి సారించకపోవటం, పర్యవేక్షణలు లేకపోవటంతో గ్రామీణ ప్రాంతంలో అందాల్సిన వైద్య సేవలు కుంటుపడుతున్నాయనేది గమనార్హం. ఇప్పటికైనా వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లా కార్యాలయంలోని ఉద్యోగులు, అధికారుల విధులు నిర్వహించే అంశంలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *